జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని... మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు ఈ దుర్మార్గులు హాని కలిగించే వారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తనపై కూడా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ 16 నుంచి 18 కేసులు పెట్టించాడని మండిపడ్డారు. తాను విడుదలైన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని... అయితే, ఆ దేవుడ్ని కూడా తనకు ఈ ముఖ్యమంత్రి దూరం చేశాడని అన్నారు. చంద్రబాబు విషయంలో న్యాయమూర్తి ద్వారా వెంకటేశ్వరస్వామి న్యాయాన్ని పలికించారని రఘురాజు చెప్పారు. వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శనం చేసుకుని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, నూతనోత్తేజంతో మళ్లీ ప్రజల మధ్య అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనను బాధ పెట్టిన అందరినీ రాజకీయంగా కడతేర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు. వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని... తాను తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేక అమెరికాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి తిరిగానని అన్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకన్న ఆలయాలన్నీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను ఏపీలోకి ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ముందే ఊహించే... లిక్కర్ కేసులో ఆయనపై మరో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ నాలుగు వారాల్లో చంద్రబాబును ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేరని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన ఐదు కేసులూ రెడ్లు పెట్టారని విమర్శించారు. కేసులు పెట్టేది కూడా రెడ్డేనని, మధ్యలో కథ నడిపించేంది సజ్జల రామకృష్ణారెడ్డి అని, పైనుంచి నడిపించేది జగన్ రెడ్డి అని అన్నారు. రెడ్లు తప్ప మరెవరూ లేరని... ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంకోచించనని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa