ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెట్ ఎయిర్‌వేస్‌కు ఈడీ షాక్.. రూ.538 కోట్ల విలువైన ఆస్తులు సీజ్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 10:49 PM

మనీల్యాండరింగ్ ఆరోపణల కేసులో ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. సంస్థ, యజమానుల పేర్లతో ఉన్న 17 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, బంగ్లాలు, వాణిజ్య భవనాలు సహా పలు ఆస్తులు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, కుమారుడు నివాన్ గోయల్ పేరుతో లండన్, దుబాయ్, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం రూ.538 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది.


కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని.. ఆ నిధులను దారిమళ్లించారనే ఆరోపణలపై నరేశ్ గోయల్ సహా ఐదుగురిపై ఈడీ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అక్టోబరు 31న ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం జెట్ ఎయిర్‌లైన్‌కు కెనరా బ్యాంకు రూ. 848 కోట్ల వరకు క్రెడిట్ పరిమితులు, రుణాలను మంజూరు చేసిందని ఆరోపించింది. వీటిలో రూ. 538 కోట్లు బకాయి ఉన్నాయి. మనీల్యాండరింగ్ కేసులో సెప్టెంబరు 1న నరేశ్ గోయల్‌ను ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.


ఇతర దేశాల్లో ట్రస్ట్‌లను సృష్టించి.. వాటి ద్వారా డబ్బును స్వాహా చేశారని ఈడీ ఆరోపించింది. ఆ ట్రస్టులను స్థిరాస్తుల కొనుగోలుకు గోయల్ ఉపయోగించారని, అది మోసపూరితంగా వచ్చిన ఆదాయం తప్ప మరొకటి కాదని ఈడీ తెలిపింది. ఆడిట్ నివేదికను ఉటంకిస్తూ.. జెట్ ఎయిర్‌వేస్ తీసుకున్న రుణాలను ఆస్తులు కాకుండా ఫర్నిచర్, దుస్తులు, ఆభరణాల కొనుగోలుకు ఉపయోగించినట్లు పేర్కొంది.


సెప్టెంబరు 12న కోర్టు విచారణ సందర్భంగా ఏవియేషన్ రంగం బ్యాంకు రుణాలపై నడుస్తుందని, అన్ని నిధులను మనీలాండరింగ్ అని పేర్కొనలేమని నరేశ్ గోయల్ అన్నారు. తాను లేదా తన కుటుంబం పేరు మీద ఎలాంటి రుణం తీసుకోలేదని లేదా వారికి గ్యారెంటర్‌గా ఉండలేదని కోర్టుకు తెలిపారు. 2011కి ముందు జెట్ ఎయిర్‌వేస్ తీసుకున్న బ్యాంకు రుణాలలో గణనీయమైన మొత్తంలో సహారా ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఉపయోగించారని ఆయన తరఫున న్యాయవాదులు తెలిపారు.


‘వ్యాపారంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కేవలం జెట్ ఎయిర్‌వేస్ మాత్రమే కాదు, ఇతర విమానయాన సంస్థలు కూడా సంక్షోభంలో ఉన్నాయి. విమానయాన రంగం బ్యాంకుల నిధుల ఆధారంగా నడుస్తుంది.. వీటన్నింటిని లాండరింగ్‌గా పేర్కొనలేం’ అని గోయల్ తరపు న్యాయవాది చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఉందని, అందుకే కొంత తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యారని లాయర్ వాదించారు. గోయల్ తన అన్ని బ్యాంకు ఖాతాలతో పాటు భారత్, విదేశాలలో ఉన్న స్థిర చరాస్తులు వివరాలను ఇవ్వకుండా తప్పించుకున్నారని అతని ప్రకటనలు సూచించాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa