ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయ్యి రోజుల నుండి, విశాఖ ఉక్కు కోసం కొనసాగుతున్న దీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 03:18 PM

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’  అని నినదించి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు  చేపట్టిన ఉద్యమం బుధవారం నాటికి వెయ్యి రోజులకు చేరుకుంది. కేంద్రం విశాఖ ఉక్కును విక్రయిస్తామని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కార్మిక సంఘాలు 2021 ఫిబ్రవరి 12 నుంచి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు ఆర్చి వద్ద శిబిరం ఏర్పాటు చేసి 999 రోజులుగా దీక్షలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్  పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజలకు రాజకీయ నాయకులకు పోరాట కమిటీ ధన్యవాదాలు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అతిపెద్దప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీనికి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వలన ప్రత్యక్షంగాను పరోక్షంగాను సుమారు లక్ష మందికి ఉపాధి కలుగుతుందని, దేశం మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న సౌకర్యాలు ఏ కర్మాగారానికి లేవని పోరాట కమిటీ పేర్కొంది. దిగుమతులు ఎగుమతులు కోసం రైలు మార్గం, సముద్రపు మార్గం ఉన్నాయని పోరాట కమిటీ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa