తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 12 వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ముందు రోజైన 11న బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించ బడవు. అంతేకాదు ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేయగా.. అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. దీపావళి నాడు తిరుమల ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తుంది టీటీడీ. ముందుగా ఘంటా మండపంలో.. సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా ఉంటారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగుస్తుంది. సాయంత్రం మాత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వమించారు. ఆలయంలో శుక్రవారం ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం.. ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa