ఓఎన్జీసీ పైపులైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను సీఎం విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.... ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నాం. కానీ, మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం అని సీఎం వైయస్ జగన్ తెలిపారు. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడాం.. వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa