ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ సీడీ రీఫండ్ ట్రాకర్ ఆప్షన్,,,,భక్తులు ఈజీగా ట్రాక్ చేసేలా సౌకర్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 07:21 PM

తిరుమలలో గదులు పొందిన భక్తులు కాషన్‌ డిపాజిట్‌ ప్రస్తుత స్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌ను పొందుపరిచామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. భక్తులు గది బుక్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ కాగానే అకామిడేషన్.. బుకింగ్‌ హిస్టరీ.. ఆఫ్‌లైన్‌ అకామడేషన్‌ సీడీ రీఫండ్‌ ట్రాకర్‌ను క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.


కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. నవంబర్ నెలలో కూడా హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. గత నెలలో 19.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.108.64 కోట్ల ఆదాయం లభించింది. 97.47 లక్షల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. అలాగే 36.50 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దాదాపు 7.06 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ధ్యానారామంలో నవంబరు 14న ప్రారంభమైన రుద్రాభిషేకం డిసెంబరు 12వ తేదీ వరకు జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 12వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాశురాల పారాయణం నిర్వహించి భక్తులందరూ పఠించేలా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.


తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో డిసెంబరు 23న గీతాజయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తారు. డిసెంబరు 28న తిరుమలలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితో పాటు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి. అవసరమైన భక్తులు కొనుగోలు చేయొచ్చన్నారు. అంతేకాదు క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa