తిరుమల శ్రీవారికి మరో భక్తుడు రెండు బస్సులు విరాళంగా అందించారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను టీటీడీకి అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. బస్సుల తాళాలను ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, తిరుమల డీఐ జానకిరామరెడ్డి పాల్గొన్నారు.
భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోందన్నారు టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి. రానున్న కాలంలో ఆయుర్వేద విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో చేరిన నూతన విద్యార్థులకు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ సంస్థ ఆదేశాల మేరకు 15 రోజులపాటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ముగింపు సభకు జేఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీవారి అనుగ్రహంతో, పూర్వజన్మ సుకృతం వల్ల ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థులకు ప్రవేశం లభించిందన్నారు సదా భార్గవి. కళాశాల చేరిన విద్యార్థులు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలని కోరారు. ఆయుర్వేదానికి కీలకమైన సంస్కృత భాషను తప్పకుండా నేర్చుకోవాలని సూచించారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కళాశాలను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలియజేశారు. టీటీడీ యాజమాన్యం సహకారంతో కళాశాలలో నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందన్నారు కళాశాల ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్. పేద రోగులకు ఉచితంగా మెరుగైన ఆయుర్వేద వైద్యం అందిస్తున్నామని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa