తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరగా.. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాయి. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. ప్రచారం చేసేందుకు నేతలు సిద్ధపడుతున్నారు. అధికార పార్టీ నేతలు తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రచారం చేసుకుంటుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని హామీల గురించి నిలదీస్తూ.. జనాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
4 సంవత్సరాల 9 నెలల పాలన పూర్తయిన సందర్భంగా.. జగనన్న ఎగ్గొట్టిన హామీల లిస్ట్ అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు. సోమవారం ఉదయం 11.38 గంటల సమయంలో కొడుకుతో కలిసి మెగాస్టార్ చిరంజీవి కలిసిన ఫొటోను ట్విట్టర్లో పెట్టిన గంటా.. 10.30 గంటల సమయంలో ‘మాట తప్పాడు, మడమ తిప్పాడు, హామీలు ఎగ్గొట్టాడు’ అంటూ ఏపీ సీఎంను ఉద్దేశించి ట్వీట్ చేశారు. జగన్ ఎగ్గొట్టిన టాప్-50 హామీలు మాత్రమే ఇవి, ప్రాముఖ్యత తక్కువ ఉన్న హామీలు బయటకు తీస్తే మరో మూడింతలు అవుతుందన్నారు.
మెగాస్టార్ను కలవడానికి గంటా జగన్ హామీలపై ట్వీట్ చేయడానికి సంబంధం లేకపోవచ్చు. కానీ తన మాజీ బాస్ చిరంజీవిని కలిసిన సమయంలోనే టీడీపీ నేత ఈ ట్వీట్ చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, విశాఖ రైల్వే జోన్ తదితర 50 హామీల గురించి తన పోస్టులో ప్రస్తావించిన గంటా.. ఇలా ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం.. కడతాం.. అని చెప్పడం తప్ప చేసిందేమీ లేదని జగన్ను ఎద్దేవా చేశారు. ‘‘మీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడంలో చతికిలపడింది. మీరు చెప్పిన సంక్షేమం సంక్షోభంలో పడింది. మీ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమైయ్యారు. ఈ సారి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీ ప్రభుత్వానికి దుకాణం సద్దుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. బై జగన్... బై బై జగన్’’ అంటూ గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa