ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. కేరళలో అత్యధికం

national |  Suryaa Desk  | Published : Sun, Dec 24, 2023, 09:13 PM

కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1.. భయాలు నెలకొన్న వేళ దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు కూడా పెంచుతోంది. ఇక శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ఇక కరోనా వైరస్ ధాటికి మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇక మన దేశంలో తొలిసారి జేఎన్ 1 కొవిడ్ వేరియంట్ వెలుగు చూసిన కేరళలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కొత్త కరోనా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3420 కి చేరింది. ఇక ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. ఈ కొత్త కేసులు ఢిల్లీ, గోవా, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. మరోవైపు.. క్రిస్మస్‌, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండగలు రానున్న నేపథ్యంలో దేశంలో జేఎన్‌ 1 వేరియంట్‌ మరింత వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలు కలిగిస్తోంది.


ఈ ఏడాది మే 21 వ తేదీ నుంచి చూస్తే తాజాగా నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం. ఇక కరోనా వెలుగు చూసినప్పటి నుంచి దేశంలో చనిపోయిన వారి సంఖ్య 5,33,332 కు ఎగబాకింది. 24 గంటల్లో నమోదైన 4 మరణాల్లో కేరళలో రెండు, రాజస్థాన్‌, కర్ణాటకలో ఒకటి చొప్పున వెలుగు చూశాయి. ఇక దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చూస్తే తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలు రానున్న నేపథ్యంలో కొవిడ్ మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు.. జేఎన్ 1 కొవిడ్ వేరియంట్ కారణంగానే ప్రస్తుతం కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ జేఎన్ 1 వేరియంట్ అంత ప్రమాదకారి ఏమీ కాదని కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగు జాగ్రత్తలు పాటిస్తూ రద్దీ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవడం వల్ల ఈ వేరియంట్ వ్యాప్తిని కొంత వరకు అడ్డుకోవచ్చని తెలిపింది. ఈ వేరియంట్ కారణంగా ప్రాణ నష్టం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa