విశాఖలో నేడు, రేపు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ సహా పలు రహదారులను మూసివేయనున్నారు. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు. దీంతోపాటు హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్.. గోశాల జంక్షన్ నుంచి వేపగుంట.. పెందుర్తి జంక్షన్ నుంచి ఎన్ఏడీ జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నారు. అటు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్ కూడా మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు.
మరోవైపు.. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వైజాగ్ ఆర్కే బీచ్కు వచ్చే పర్యాటకులకు కూడా పోలీస్లు కీలక సూచనలు చేశారు. పర్యాటకుల వాహనాలను పార్కింగ్కు నిర్ధేశించిన ప్రాంతాల్లో మాత్రమే పార్క్ చేయాలని తెలిపారు. లేకపోతే జరిమానా విధిస్తామని చెప్పారు. ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హోటళ్లు, క్లబ్లు, పబ్ల నిర్వాహకులకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ. రవిశంకర్ పలు మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్లు, కార్యక్రమాలు నిర్వహించుకునే హోటళ్లు, క్లబ్లు, పబ్లు.. వాటి కోసం ముందుగానే అనుమతి మంజూరు కోసం విశాఖ పోలీసు కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి తీసుకోకపోతే చట్ట రీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్ మెంట్ చట్టం-2013 ప్రకారం హోటళ్లు, క్లబ్లు, పబ్ల నిర్వాహకులు.. బయటకు వెళ్లే.. లోపలికి వచ్చే మార్గాలు.. పార్కింగ్ ప్రాంతాల్లో కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విశాఖ సీపీ తెలిపారు. హోటళ్లు, క్లబ్లు, పబ్ల వద్ద ట్రాఫిక్, భద్రత అదుపులో ఉండేందుకు అవసరమైన సిబ్బందిని వారే నియమించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్త సంవత్సర వేడుకలను విశాఖ వాసులు జరుపుకోవాలని విశాఖ సీపీ డాక్టర్ ఏ. రవిశంకర్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa