ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటిని వేలం వేయనున్న ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 10:57 PM

అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం.. చిన్నతనంలో నివాసం ఉన్న ఇంటిని వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ ఇంటితోపాటు దావూద్ ఇబ్రహీంకు చెందిన మరికొన్ని ఆస్తులను కూడా వేలం వేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ఆస్తులను శుక్రవారం వేలం వేసేందుకు అధికారులు అన్ని ప్రక్రియలు పూర్తి చేసినట్లు వివిధ మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే మహారాష్ట్రలో ఉన్న దావూద్ ఇబ్రహీం ఇంటిని వేలం వేయనున్నారు.


మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా పరిధిలో ఉన్న ముంబాకే గ్రామంలో శుక్రవారం ఈ వేలం ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటితోపాటు దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన మరికొన్ని ఆస్తులను కూడా ఈ వేలం ప్రక్రియలో అధికారులు ఉంచారు. అయితే ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆ ఇంటిని, ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని జనవరి 5 వ తేదీన ముంబైలో వేలం వేయనున్నట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 4 ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ చట్టం 1976 కింద దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


గత 9 ఏళ్లలో దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన రెస్టారెంట్‌, ఫ్లాట్స్‌, గెస్ట్‌ హౌస్‌ సహా 11 ఆస్తుల్ని వేలం వేసి దర్యాప్తు సంస్థలు సుమారు రూ.12 కోట్లు సమీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఒక రెస్టారెంట్‌ రూ.4.53 కోట్లు, 6 ఫ్లాట్లు రూ. 3.53 కోట్లు, గెస్ట్‌ హౌజ్ రూ. 3.52 కోట్లు ఇప్పటివరకు అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్‌ ఇబ్రహీం.. 1983 లో ముంబైకి వచ్చాడు. అంతకుముందు ముంబాకే గ్రామంలో నివసించేవాడని అధికారులు పేర్కొన్నారు. అయితే 1980 ల్లోనే పాకిస్థాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం.. అక్కడి నుంచి 1993 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా వ్యహరించాడు. అమెరికాతోపాటు, ఐక్యరాజ్యసమితి కూడా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస జాబితాలో అతడి చిరునామా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు పేర్కొంది. అయితే దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నాడన్న విషయాన్ని చెప్పడానికి పాక్‌ అంగీకరించడం లేదు. కానీ ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు తప్పని పరిస్థితుల్లో 2020లో ఒకసారి మాత్రం దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.


అయితే ఇటీవల దావూద్ ఇబ్రహీం చనిపోయాడనే వార్తలు ఒక్కసారిగా వినిపించాయి. అయితే దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని.. దాంతో కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్పించారని కథనాలు వెలువడ్డాయి. ఆ చికిత్స పొందుతూనే దావూద్ ఇబ్రహీం చనిపోయినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు. దీంతో ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం బతికి ఉన్నాడా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa