చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెప్తానని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం తనకుందని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో కేశినేని నాని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘ఎల్లుండి జరిగే సభకు నన్ను రావొద్దన్నారు. అధినేత ఆజ్ఞను భక్తుడిలా పాటిస్తా. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది’ అని కేశినేని నాని అన్నారు.
‘నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే, పెద్ద స్థాయిలో ఉండేవాణ్ని’ అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం (జనవరి 5) మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నాని స్పందించారు. ఎంపీ కేశినేని నాని వ్యవహారం టీడీపీలో కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేను కలవడం వివాదాస్పదమైంది. కేశినేని నాని పార్టీ మారనున్నారని ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిన్న కేశినేని నాని, కేశినేని శివనాథ్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఈసారి విజయవాడ టికెట్ను మరో వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నానికి సమాచారం ఇచ్చింది.
వైసీపీ ఎమ్మెల్యే, నేను మంచి స్నేహితులం
మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తాను చాలా స్నేహితులం అని ఎంపీ కేశినేని నాని తెలిపారు. తమ తండ్రుల కాలం నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు ‘మేమిద్దరం కలిశాం. ఒకే దగ్గర కూర్చున్నాం. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు. నేను నా పార్టీ లైన్ దాటలేదు. ఆయన (వసంత కృష్ణ ప్రసాద్) తన పార్టీ కోసం కష్టపడ్డారు. నేను నా పార్టీ కోసం కష్టపడ్డాను’ అని కేశినేని నాని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన విషయాన్ని గుర్తు చేసిన కేశినేని నాని.. అలా కలవడం తప్పా అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డి.. బీజేపీ పార్టీ నాయకుడిని కలిస్తే.. తప్పు కానప్పుడు నాది తప్పు ఎలా అవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు
‘నన్ను తిరువూరు సభకు రావొద్దన్నారు. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. సరే.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటా. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు’ అని కేశినేని నాని స్పష్టం చేశారు. ‘మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది’ అని కేశినేని నాని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa