ప్రతీ విషయంలో భారత్ పట్ల తన అక్కసును వెళ్లగక్కడం చైనాకు అలవాటుగా మారింది. విషయం ఏదైనా వివాదం ఏదైనా భారత్పై ఏదో ఒక విమర్శ చేయడం డ్రాగన్కు సర్వసాధారణం అయింది. పాకిస్థాన్ గురించి ఏ విషయం ఉన్నా.. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా మాట్లాడని చైనా.. భారత్ విషయంలో మాత్రం విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా భారత్, మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదంలోనూ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. ఈ విషయంలో భారత్ మరింత ఓపెన్ మైండెడ్గా ఉండాలని చైనా పేర్కొనడం ఆ దేశ సంస్కృతికి అద్దం పడుతోంది.
భారత వ్యతిరేక వైఖరి కలిగిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ.. ‘ఇండియా అవుట్’ నినాదంతో అధికారంలోకి వచ్చారు. చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మహ్మద్ మొయిజ్జూ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విదేశీ పర్యటన కోసం చైనాకు వెళ్లిన మహ్మద్ మొయిజ్జూ.. అదే సమయంలో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య వివాదం చెలరేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మహ్మద్ మొయిజ్జూ చైనాలో దిగిన రోజే అక్కడి ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్లో భారత్పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దక్షిణాసియాలో నెలకొన్న సమస్యలను చూడటానికి భారత్కు ‘‘ఓపెన్ మైండెడ్’’ విధానం అవసరమని చైనా తన అక్కసును వెళ్లగక్కింది. తాము మాల్దీవులను ఎల్లప్పుడూ సమాన భాగస్వామిగా చూస్తామని.. మాల్దీవులు సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే మాల్దీవులు, భారత్ మధ్య స్నేహపూర్వక, సహకార సంబంధాలను కూడా గౌరవిస్తామని తెలిపింది. భారత్లో మాల్దీవులతో సంబంధాల ప్రాముఖ్యత గురించి తమకు తెలుసని పేర్కొంది. అయితే చైనా, భారత్ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటి కారణంగా తాము ఎన్నడూ కూడా భారత్ను దూరం పెట్టాలని మాల్దీవులను కోరలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న వివాదం మాల్దీవులు, భారత్ మధ్య సహకారానికి, సంబంధాలకు పెద్ద అడ్డుగా చూస్తామని ప్రస్తుత భారత్ మాల్దీవుల వివాదంపై చైనా స్పందించింది.
మరోవైపు.. చైనా-భారత్-మాల్దీవుల మధ్య త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా వెల్లడించింది. దక్షిణాసియా దేశాలతో చైనా సహకారం "జీరో-సమ్ గేమ్" అని తెలిపింది. అందువల్ల భారత్ మరింత ఓపెన్ మైండెడ్గా ఉండాలని సూచించింది. అంతకుముందు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నారని తెలిపారు. దీంతో చైనా-మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత మెరుగ్గా ఉంటాయని.. రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుతాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa