అయోధ్య రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరే ఘట్టం కోసం కోట్లాదిమంది హిందువులు ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఇంకా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 11 రోజులే మిగిలి ఉందని ఈ సందర్భంగా తాను ప్రత్యేక దీక్షను చేపడుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన ఆడియో సందేశంలో దేశ ప్రజలకు వివరించారు.
ఈ మహోన్నత ఘట్టాన్ని తాను కనులారా వీక్షించే అవకాశం కలగడం అదృష్టమని పేర్కొన్నారు. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా 11 రోజులే మిగిలి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ సమయంలో దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎంతో ఉద్వేగంతో ఉన్నానని.. తన మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మెదులుతున్నాయని తెలిపారు. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయని.. పేర్కొన్న ప్రధాని మోదీ.. ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భమని పేర్కొన్నారు.
జనవరి 12 వ తేదీన ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి జయంతి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను గుర్తు చేసుకున్నారు. జిజియాబాయి గురించి తలుచుకున్నప్పుడు తనకు తన తల్లి హీరాబెన్ గుర్తుకు వస్తుందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె తన చరమాంకం వరకూ రాముడి సేవలోనే తరించిందని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్.. 2022 లో 99 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7 వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa