రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 1 తేదీన ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను సమర్పించనుండగా.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 17 వ లోక్సభ పదవీకాలం జూన్ 16 వ తేదీతో ముగియనుండగా.. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు కానున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో ఈసారి కేంద్ర ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు, పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే ఈ నెల 31 వ తేదీన ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారు.. అతని బృందం రూపొందించిన ఈ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళా రైతులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి మూడుసార్లు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు ఇస్తోంది. ఇది రెట్టింపు చేస్తే మహిళా రైతులకు ఏడాదికి మూడుసార్లు రూ.4 వేల చొప్పున అందిస్తే మొత్తం రూ.12 వేలు అందనున్నాయి. ఈ ప్రకటనను ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa