అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కానుకలు వెళ్లాయి. అయోధ్యలో రాముడు కొలువు దీరనున్న ఈ నెల 22 వ తేదీన డ్రై డే పాటించాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. మరికొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా ఆరోజు ఇళ్లు, దేవాలయాల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ, అయోధ్య ఆలయ అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు ఉచిత రైలు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
అయోధ్య శ్రీరాముడిని దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించిన పథకానికి ఛత్తీస్గఢ్ సర్కార్ ఆమోదం తెలిపింది. సీఎం విష్ణు దేవ్సాయి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత రైలు ప్రయాణ పథకం సాయంతో 20 వేల మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోగలుగుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. 18 నుంచి 75 ఏళ్ల వయస్సు గల వారు వైద్యపరంగా ఫిట్గా ఉన్నవారు ఈ పథకానికి అర్హులని సీఎం విష్ణు దేవ్సాయి తెలిపారు. అయితే మొదటి దశలో 55 ఏళ్లు.. ఆ పైబడిన వారిని ఎంపిక చేయనున్నారు. యాత్రికుల ఎంపిక కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ఈ ఉచిత అయోధ్య రైలు ప్రయాణ పథకాన్ని ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు నిర్వహిస్తుందని.. అవసరమైన బడ్జెట్ను రాష్ట్ర పర్యాటక శాఖ అందిస్తుందని పేర్కొన్నారు. ఈ రైల్వే ప్రయాణంలో ప్రజల ఆహారం, పానీయాలను ఐఆర్సీటీసీ చూసుకుంటుందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలిపింది.
ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు రైలు ప్రయాణం దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో అయోధ్య చివరి స్టేషన్. రాయ్పూర్, దుర్గ్, రాయ్ఘర్, అంబికాపూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని వెల్లడించారు. భక్తులు వారణాసిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారని.. అక్కడ వారిని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకెళ్లి గంగా హారతిలో పాల్గొనేలా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జనవరి 22 వ తేదీని ఆ రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa