2024, ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. గతంలో 2023 బడ్జెట్ సందర్భంగా ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కొత్త పన్ను విధానంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది కేంద్రం. ఇక ప్రామాణిక తగ్గింపు రూ. 50 వేలుగా ఉండగా.. మొత్తం రూ. 7.50 లక్షల వార్షిక ఆదాయం వచ్చే వారు కూడా పన్ను చెల్లించాల్సిన పని లేకుండా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్ని కూడా ఆరు నుంచి ఐదుకు తగ్గించింది.
ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కూడా కేంద్రం మరింత ఊరట కల్పిస్తుందని.. పన్ను చెల్లింపుదారులు ఆశలు పెట్టుకున్నారు. వాటిల్లో పన్ను రాయితీలు, పాత పన్ను విధానంలో మరిన్ని మినహాయింపులు కోరుతున్నారు. అయితే పాత పన్ను విధానానికి సంబంధించి అదనపు పన్ను మినహాయింపులు, అత్యల్ప స్థాయిలో పన్ను మినహాయింపులు ఉండొచ్చని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి.. ఒక ఆంగ్ల మీడియాకు వెల్లడించినట్లు తెలిసింది. ఇంకా పాత పన్ను విధానంలో మహిళా రైతులకు మరింత మేలు చేసేలా చర్యలు ఉండటం సహా.. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సుమారు రూ. 7 లక్షలకు చేర్చొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త చర్యలు.. ప్రత్యక్ష పన్నులను పెంచే లక్ష్యంతో ఉండటం వల్ల ఆర్థిక లోటుపై ప్రభావం పడదని అనుకుంటున్నారు.
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. ఈసారి గతంలో లాగా పెద్ద పెద్ద ప్రకటనలు ఉండవని.. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి సాధారణంగానే ఉంటుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ.. ఆదాయపు పన్ను వర్గాల్లో మాత్రం ఎక్కడో ఆశలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అప్పుడు జులైలో మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ఉండనుంది. ఈ నేపథ్యంలో మరి ఈ మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉండనున్నాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa