ప్రపంచంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో భారీ ఆంజనేయుడి విగ్రహానికి గణపతి సచ్చిదానంద స్వామిజీ శంకుస్థాపన చేశారు. సుమారు పదికోట్ల రూపాయల వ్యయంతో 178 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పనున్నారు. మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఈ భారీ విగ్రహ ఏర్పాటు బాధ్యతను తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం కూడా ఏపీలోనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని మండపం గ్రామంలో వంశధార నదీతీరంలో 176 అడుగుల ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని విగ్రహం కంటే పెద్ద విగ్రహాన్ని రాజానగరంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన గణపతి సచ్చిదానంద స్వామిజీ.. విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా రాజానగరం మారుతుందన్నారు. చేపట్టే కార్యాలు ఏవైనా విజయవంతం కావాలంటే కార్యసాధకుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు సచ్చిదానంద స్వామిజీ. హనుమంతుడిని పూజించడం కష్టాలు తీరతాయని చెప్పారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయితే శ్రీకాకుళం జిల్లాలో భారీ హనుమాన్ విగ్రహాన్ని జై శ్రీకాంత్ చారి నేతృత్వంలోని హనుమాన్ విగ్రహ కమిటీ ఏర్పాటుచేసింది. ఈ విగ్రహం ద్వారా హిందూ ధర్మాన్ని యువతలో పెంపొందించడమే లక్ష్యమని అప్పట్లో కమిటీ ప్రకటించింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహాలు రెండూ ఏపీలోనే కొలువుదీరనున్నాయి. అటు కర్ణాటకలోనూ 215 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa