ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు ఈ నెలలో మూడ్రోజులు ఆ దర్శన టికెట్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 08:33 PM

తిరుమలలో ఈనెల 16న సూర్యజయంతిని పురస్కరించుకుని జరిగే రథసప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయం ఎదుట ఎండవేడిమికి భక్తులు ఇబ్బందిపడకుండా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాధిపతులతోనూ సమావేశాలు ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేశారు. భక్తుల సౌకర్యార్థం వివిధ పనులు వేగంగా పూర్తిచేస్తున్నారు.


రథసప్తమి సందర్భంగా.. ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ,సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు. అంతేకాదు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ దర్శన టోకెన్లు రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. వాహన సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.


అంతేకాదు తిరుమలలో రథసప్తమి రోజు నిర్వహించే వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదం అందజేయనున్నారు. భక్తులకు సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను.. తాగునీరు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి రోజు రద్దీ ఉంటుందనే అంచనాతో.. ప్రత్యేక దర్శనాలు (వీఐపీ బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు) ను కూడా రద్దు చేశారు.


తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించడం ఆనవాయితీగా వస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలుగా భావిస్తుంటారు. ఎప్పటి నుంచో పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి, మాఘ సప్తమి అని పిలుస్తారు. ఆ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని.. ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాలు చెబుతున్నాయి. రథ‌సప్తమి ప‌ర్వ‌దినం సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.


ఆ రోజు తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనంపై విహరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa