ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఎన్ని రోజులుగానో ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ చేయూత డబ్బులు మహిళల అకౌంట్లలో జమ చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందుగానే వైఎస్ఆర్ చేయూత నిధులను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి ఏడో తేదీన వైఎస్ఆర్ చేయూత నిధులను జగన్ విడుదల చేయనున్నారు. ఏడో తేదీన అనకాపల్లిలో పర్యటించనున్న జగన్.. వైఎస్ఆర్ చేయూత ఆఖరి విడత నిధులను అప్పుడే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.
45 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 రూపాయలను ఆర్థిక సాయంగా అందించనున్నారు. ఆదాయపన్ను పరిధిలోకి రానివారితోపాటు, పది ఎకరాల మెట్టభూమి లేదా 3 ఎకరాల మాగాణి మించనివారు ఈ పథకానికి అర్హులు. గత మూడేళ్లుగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన ప్రభుత్వం.. నాలుగో విడత సాయాన్ని మార్చి ఏడో తేదీన జమ చేయనుంది. అయితే ఈ సారి పథకం అమలు సమయంలో సీఎం జగన్ లబ్ధిదారులకు రాసిన లేఖలను సైతం వాలంటీర్లు అందించనున్నారు.
మరోవైపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లు ఆదివారం సభాస్థలిని పరిశీలించారు.స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్కు స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa