ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరుత పులి భయం.. కొండ మొత్తానికి నిప్పుపెట్టిన ఊరిజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 10:29 PM

భయం.. మనిషిలోని ఆ భయమే అతనితో ఎంతపనైనా చేయిస్తుంది. ఎంతటి చర్యకైనా ఉరిగొల్పుతుంది. అలాంటి భయమే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఓ గ్రామ ప్రజలతో విపరీత చర్యకు కారణమైంది. పులి భయంతో ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్ గ్రామ ప్రజలు కొండ మొత్తానికి నిప్పుపెట్టారు. పులి వచ్చి దాడి చేస్తుందనే భయంతో కొండకు నిప్పుపెట్టగా.. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.


అసలు సంగతిలోకి వస్తే.. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండల ప్రజలు చిరుతపులి తిరుగుతోందన్న వార్తలతో భయపడిపోతున్నారు. గత నెలన్నర రోజులుగా ఆ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గుడికల్ గ్రామానికి ఆనుకుని ఉన్న కొండలలో చిరుతపులి తిరుగుతోందని ఆ ఊరిజనం భయాందోళనకు గురౌతున్నారు. మేతకోసం అడవికి వెళ్తున్న మేకల మందపై దాడి చేస్తున్నట్లు చెబుతున్నారు. గతనెలలో ఇలాగే మేకల మందపై దాడి చేసి మేకలను చంపేసిన ఘటన సైతం జరిగింది. ఇక అప్పటి నుంచి జనం భయం మరింత పెరిగి పోయింది.


మరోవైపు చిరుత గుట్టల్లో దాక్కున దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. దీనిపై ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది పులిని బంధించేందుకు బోన్లను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు ప్లాన్ వర్క్ ఔట్ కాలేదు. చిరుత పులి బోనులో చిక్కలేదు. కానీ ఊహించని విధంగా రైతులు ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతను బంధించి మరో చోటకు తరలించారు. కానీ మరో చిరుతపులి ఈ ప్రాంతంలో తిరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం ( మార్చి6) రాత్రి ఊరిలోని కొంతమంది కొండకు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టడంతో కొండపై భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa