ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 టిప్స్‌తో రోజుకు 600 లీటర్లు ఆదా.. బెంగళూరు నీటి సమస్యకు డాక్టర్ పరిష్కారం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 10:22 PM

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో పరిస్థితి రోజు రోజుకూ తీవ్ర తరం అవుతోంది. దీంతో ప్రభుత్వాలు, అధికారుల తీరుపై బెంగళూరు నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిని ఎలా ఆదా చేయాలి.. ఉన్న నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి అని తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు నీటి ఆదాకు సంబంధించిన విషయాలను, వీడియోలను పంచుకుంటున్నారు. బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్రా కూడా తాజాగా ఓ వీడియోను షేర్ చేయగా.. ఏసీ నుంచి బయటికి వెళ్లిపోయే వేస్ట్ వాటర్‌ను తిరిగి ఎలా ఉపయోగించుకోవాలని అందులో ఉంది. ఇక తాజాగా బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ నీటి ఆదాకు సంబంధించి 4 సూత్రాలను వెల్లడించారు. ఈ 4 టిప్స్ పాటించి తాను రోజుకు 600 లీటర్ల నీటిని ఆదా చేసినట్లు తెలిపారు.


బెంగళూరుకు చెందిన డాక్టర్‌ దివ్య శర్మ తాను నీటిని ఆదా చేసిన విధానం గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నలుగురు సభ్యులు ఉండే తన ఇంట్లో రోజుకు 600 లీటర్ల నీటిని ఆదా చేసినట్లు ట్విటర్‌లో తెలిపారు. అయితే నీటిని ఆదా చేసేందుకు అసలు వాడకుండా ఉండకుండా.. కొన్ని టిప్స్ పాటించామని పేర్కొన్నారు. దీంతో రోజుకు 600 లీటర్ల నీటిని ఆదా చేసుకున్నామని దివ్య శర్మ వివరించారు. ఇంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి భారీగా నీటిని ఆదా చేసినట్లు చెప్పారు.


తమ ఇంట్లోని బాత్రూంలో ఉండే ఓవర్‌హెడ్‌ షవర్లను తొలగించినట్లు దివ్య శర్మ తెలిపారు. ఓవర్ హెడ్ షవర్‌తో ఒక నిమిషానికి 13 లీటర్ల నీరు బయటికి వస్తుందని.. దీంతో 5 నిమిషాలు స్నానం చేస్తే 65 లీటర్లు అయిపోతాయని దివ్య శర్మ వెల్లడించారు. అదే బకెట్‌ ద్వారా స్నానం చేస్తే 20 లీటర్లతోనే పూర్తి చేయవచ్చని తెలిపారు. ఇలా తమ ఇంట్లో ఒక్కొక్కరు 45 లీటర్లు ఆదా చేయగా.. మొత్తం 180 లీటర్లు సేవ్ అయ్యాయని వివరించారు.


ఇక తమ ఇంట్లోని కుళాయిలు ఏకధాటిగా పోయకుండా.. తుంపరలుగా పడేలా ప్రత్యేక పరికరాలు నల్లాలకు బిగించినట్లు తెలిపారు. దీనివల్ల ఒక రోజు మొత్తంలో గిన్నెలు శుభ్రం చేయడానికి గతంలో 450 లీటర్ల నీరు పడితే.. ఇప్పుడు 90 లీటర్ల నీటితోనే అంతా పని అయిపోయిందని చెప్పారు. అంటే కేవలం గిన్నెలు కడగడలోనే దాదాపు 360 లీటర్లు ఆదా చేయగలిగామని దివ్య శర్మ వెల్లడించారు. మరోవైపు.. వాటర్ ప్యూరిఫయర్‌ నుంచి వృథాగా వెళ్లిపోయే నీటిని ఒడిసి పట్టి వాటిని ఇల్లు తుడవడానికి, గార్డెన్‌లో చెట్లకు ఉపయోగించామని.. దానివల్ల రోజుకు 30 లీటర్లు ఆదా అయినట్లు చెప్పారు. ఇక తమ కారును కడగడాన్ని ఆపేశామని.. కేవలం కారుపై పడిన దుమ్ము తుడుచుకుంటున్నట్లు వివరించారు. రోజు విడిచి రోజు తడి బట్టతో తుడుస్తున్నట్లు దీని వల్ల మరో 30 లీటర్లు ఆదా చేసినట్లు వెల్లడించారు.


ఇలా రోజువారీ తమ పనులు చేసుకుంటూనే నీటిని సులువుగా ఆదా చేశామని దివ్య శర్మ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రోజుకు 600 లీటర్ల నీరు ఆదా చేయడం చిన్న విషయమేమీ కాదని ఆమె చెప్పారు. చిన్న చిన్న సూత్రాలు పాటించి చాలా నీటిని ఆదా చేసినట్లు తెలిపారు. దీంతో దివ్య శర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు నగరంలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యను తీర్చుకునేందుకు డాక్టర్ దివ్య శర్మ లాగా అంతా నీటిని ఆదా చేసేందుకు ఇలాంటి సరికొత్త ఐడియాలను ఆలోచించాలని.. వాటిని పాటించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇక దివ్య శర్మ చేసిన పనికి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa