ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓ వైపు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతూ ఉంటే సీఎం జగన్ మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచార హోరు సాగిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో భారీగా జనసమీకరణ చేసి జనంలోకి దూసుకెళ్లిన వైసీపీ.. తాజాగా బస్సు యాత్రకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ నెల 27 వ తేదీన ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్రను మొదలు పెడతారని తెలిపారు.
బస్సు రూట్ మ్యాప్ను వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర జరుగుతుందని తెలిపారు. సిద్ధం సభలకు కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఈ బస్సుయాత్రలో భాగంగా రాష్ట్రమంతా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను జగన్ కలుస్తారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ బస్సు యాత్ర జరుగుతుందని.. తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సజ్జల స్పష్టం చేశారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 27 వ తేదీన మొదలై.. వచ్చే నెల 18 వ తేదీ వరకు ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉందని సజ్జల వివరించారు. తొలిరోజు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారని.. ఆరోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ ‘మేమంతా సిద్ధం’ తొలి సభ జరుగుతుందని తెలిపారు. ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్ చేసేలా ఈ సభలు జరుగుతాయని పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో సీఎం జగన్ మాట్లాడే కార్యక్రమం ఉంటుందని.. ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే వారి నుంచి తీసుకుంటారని వెల్లడించారు.
మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలను కలుస్తారని.. అనంతరం సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. వీలైనంత వరకు ఒక పార్లమెంటులో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తామని.. ఇప్పటి వరకు 3 రోజుల బస్సు యాత్ర ఖరారైందని వివరించారు. తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ.. మూడో రోజు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశించి.. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చామని సజ్జల తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa