అనంతపురం జిల్లా ఉరవకొండలో అద్భుతం జరిగింది. గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. సోమవారం స్వామివారికి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవం ప్రారంభానికి ముందు రథంపై చంద్రమౌళీశ్వర స్వామి ఆశీనులు కాగా.. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణతో రథాన్ని ముందుకు కదిలించడానికి విశ్వప్రయత్నం చేయగా ఇంచు కూడా ముందుకు కదలలేదు.
సరిగ్గా అదే సమయంలో గవిమఠం సంస్థాన ఏనుగు గజలక్ష్మి రంగ ప్రవేశం చేసి తలతో రథాన్ని తోసి కదిలించింది. అంతే రథం ఒక్కసారిగా ముందుకు కదలగా భక్తులు ఈలలు కేకలు వేస్తూ శివ నామస్మరణతో రథాన్ని ముందుకు లాగారు. బాహుబలి సినిమా సీను తలపించేలా జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. భక్తులు శివనామస్మరణతో హుషారుగా రథాన్ని ముందుకు కదిలించగా.. ఇదంతా స్వామివారి మహిమేనంటూ చర్చించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో ఇవాళ లంకాదహనం, 21వ తేదీన వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఆధ్యాత్మిక శైవ క్షేత్రమే కాకుండా వందల సంవత్సరాలుగా విద్యా, వైద్యం, ఉపాధి తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉరవకొండలోని గవిమఠం పరిధిలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో 770 ఉప మఠాలు ఉన్నాయి. మఠంలో సహజంగా వెలిగిన చంద్రమౌళీశ్వరుడు గవి (గుహ)లో పూజలు అందుకుంటుండటంతో ఇది గవి మఠంగా పేరు గాంచింది. ప్రస్తుతం మఠానికి 8వ పీఠాధిపతిగా చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారిగా డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa