ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు పక్కా.. వారిని మాత్రం అస్సలు మర్చిపోను: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 07:46 PM

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, ఎన్డీయే కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపైనా తన అంచనా చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో జోరుమీదున్న చంద్రబాబు ఇప్పటి వరకూ 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు టీడీపీ తరుఫున అభ్యర్థులను ప్రకటించారు. ఇక వారందరితో కలిసి విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ ప్రత్యేక వర్క్ షాప్‌కు హాజరైన చంద్రబాబు.. టికెట్లు సంపాందించుకున్న పార్టీ నేతలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి 160 ఎమ్మెల్యే సీట్లు పక్కా అని అన్నారు. 160 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న చంద్రబాబు.. 400 సీట్లకు పైగా కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. కడప ఎంపీ సీటును కూడా ఈసారి కూటమి గెలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.


మరోవైపు కూటమి పొత్తుల్లో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయామని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం వాళ్లు చేసిన త్యాగం ఎప్పటికీ మరిచిపోనన్న టీడీపీ చీఫ్.. సీట్లు రాని అభ్యర్థుల మంచీచెడ్డలు పార్టీ చూసుకుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్న చంద్రబాబు.. నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలవాలనేదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. టికెట్ రాని నేతలు నిరుత్సాహపడవద్దని.. పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


మరోవైపు ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లలో.. బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పవన్ పార్టీ బరిలోకి దిగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa