ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రస్తుతం ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇక ఆ సందేశంలో బీజేపీ నేతలను సోదరసోదరీమణులు అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. తనను ఈడీ అరెస్ట్ చేసిన విషయంపై బీజేపీ నేతలపై ఎలాంటి కోపం, ద్వేషం చూపించవద్దని ఆప్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడం తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు.
బీజేపీని ద్వేషించకండి అని ఈడీ కస్టడీ నుంచి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు సూచించారు. సమాజం కోసం చేసే పనిని కొనసాగించాలని పేర్కొన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు ఎన్నో శక్తులు ఉన్నాయని.. అలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. అలాంటి అరాచక శక్తులను గుర్తించి, ఓడించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. తనపై ఢిల్లీ సోదరీమణులు, తల్లులు నమ్మకం ఉంచాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన అరెస్ట్పై స్పందించిన కేజ్రీవాల్.. తనను ఎల్లకాలం కటకటాల వెనక ఉంచే జైలు లేనే లేదని పేర్కొన్నారు. అతి త్వరలోనే బయటికి వచ్చి.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని కేజ్రీవాల్ చెప్పిన మాటలను ట్విటర్లో విడుదల చేసిన వీడియోలో సునీతా కేజ్రీవాల్ వెల్లడించారు.
మరోవైపు.. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంపై శుక్రవారం ట్వీట్ చేసిన సునీతా కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. అధికార దురహంకారంతో, నియంతృత్వంతో దేశంలోని ప్రతి ఒక్కరిని అణచివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ సునీత మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నా ఆయన జీవితం దేశానికే అంకితమని.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీ సీఎంగా ఉంటారని ఆప్ నేతలు స్పష్టం చేస్తున్నారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఢిల్లీ పాలనా వ్యవహారాలు చూస్తారని పేర్కొంటున్నారు. అయితే అది అంత సాధ్యం అయ్యే పని కాదని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు అతిషి మార్లేనా, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, రాఘవ్ చద్దా పేర్లు తెరపైకి వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa