అస్సాంకు చెందిన ఓ రాజకీయ నాయకుడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఆ నేత ఒక బెడ్పై కరెన్సీ నోట్లపై పడుకున్నట్లు ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. అతనిపైనా, కింద మొత్తం రూ.500 నోట్లు ఉండటం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్-యూపీపీఎల్కు చెందిన మాజీ నేత కావడం గమనార్హం.
అస్సాంలోని ఉదాల్గిరి జిల్లాకు చెందిన బెంజామిన్ బసుమతారీ అనే రాజకీయ నాయకుడికి చెందిన ఆ ఫోటో ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. బోడోలాండ్ నేత అయిన బెంజామిన్ బసుమతారీపై ఇప్పటికే తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు సంబంధించి తీవ్ర అక్రమాలకు జరిగాయని నమోదైన కేసుల్లో బెంజామిన్ బసుమతారీ నిందితుడిగా ఉన్నారు. ఇక ఆయన విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్గా ఉన్న సమయంలో ఈ రెండు పథకాల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్ బోరో ట్విటర్ వేదికగా స్పందించారు. తమ పార్టీకి బెంజామిన్ బసుమతారీకి ఎలాంటి సంబంధం లేదని.. ఈ ఏడాది జనవరి 10 వ తేదీనే ఆయనను యూపీపీఎల్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ఫిబ్రవరి 10 వ తేదీనే వీసీడీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇక వైరల్ అవుతున్న ఫొటో తనదేనని బెంజమిన్ బసుమతారీ ఒప్పుకున్నారు. అయితే అది ఇప్పటి ఫోటో కాదని.. 5 ఏళ్ల క్రితం ఒక పార్టీలో తన స్నేహితులు తీశారని వెల్లడించారు. ఆ ఫొటోలోని డబ్బు తన సోదరిది అని చెప్పారు.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోను పంజాబ్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్లో షేర్ చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై, నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసిగొల్పే బీజేపీ.. అస్సాంలో బీజేపీ కూటమి పార్టీ నేతపై ఎలాంటి చర్య తీసుకుంటుందని ప్రశ్నించింది. ఢిల్లీలో ఇంటర్నేషనల్ లెవల్ ప్రభుత్వ స్కూల్స్, ఆస్పత్రులను ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారిని జైలుకు పంపుతున్నారని.. ప్రజా ధనాన్ని దోచుకునే వారు అధికార ప్రయోజనాలు అనుభవిస్తున్నారని.. ఇది చాలా సిగ్గుచేటు అని ఆప్ విమర్శలు గుప్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa