ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీవ్ర ఆందోళనలో ఆప్ వర్గాలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 10:27 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 28 వరకు విధించిన ఈడీ కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి సంచలన వార్తలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం బాగాలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌కు డయాబెటిస్ ఉందని.. ప్రస్తుతం ఆయనకు చక్కెర స్థాయిలో బాగా తగ్గిపోయాయని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్లు తెలుస్తోంది. డయాబెటిస్‌ ఉన్న కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో షుగర్‌ లెవల్స్‌ దారుణంగా పడిపోయాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్‌ శరీరంలో షుగర్ స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక దశలో ఆయన షుగర్‌ లెవల్స్ ఏకంగా 46 ఎంజీ స్థాయికి పడిపోయాయని తెలుస్తోంది. అయితే ఈ స్థాయిలో చక్కెర లెవల్స్ పడిపోవడం అత్యంత ప్రమాదకర పరిస్థితి అని డాక్టర్లు చెప్పినట్లు ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి.


ఇక అంతకుముందు కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా విడుదల చేసిన వీడియో సందేశంలో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను కలిసినపుడు తనకు షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నట్లు ఆయన చెప్పారని సునీత వెల్లడించారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని అందరం ప్రార్థిద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఇక గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో.. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు సీఎం కేజ్రీవాల్ బయటపెడతారని సునీత తెలిపారు. మద్యం కేసులో డబ్బుకు సంబంధించిన ఆధారాలను ఇస్తారని.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లాయి అనే వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. దీంతో కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పనున్నారనే ఉత్కంఠ నెలకొంది.


ఇక ఈ నెల 21 వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. మార్చి 28 వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గురువారంతో ఆయన ఈడీ కస్టడీ ముగియనుండడంతో అధికారులు.. రేపు కేజ్రీవాల్‌ను మళ్లీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు తన అరెస్టును సవాల్‌ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa