ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ అధికారి కారులో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్.. కాంట్రాక్టర్ నిర్వాకం, కారణం తెలిసి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 07:37 PM

విజయవాడలో విద్యుత్‌శాఖ అధికారి కారులో జీపీఎస్ ట్రాకర్ బయటపడింది. ఆ ట్రాకర్‌ను చూసి అధికారి అవాక్కయ్యారు..ఏం జరిగిందని ఆరా తీస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి.. విద్యుత్‌శాఖకు కారును అద్దెకు ఇచ్చిన కాంట్రాక్టర్ ఆ ట్రాకర్‌ను ఏర్పాటు చేసినట్లు తేలింది. అధికారి ఎక్కడికి వెళుతున్నారు.. ఏం చేస్తున్నారు.. ఆయన కదలికల్ని అక్రమంగా విద్యుత్తు వినియోగించే వారికి, ఆశాఖకు చెందిన మరికిందరు అధికారులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.


విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన మాదాటి పూర్ణచంద్రరావు .. కానూరు ఏపీసీపీడీసీఎల్‌ ఆపరేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఈ కార్యాలయానికి ఎన్టీఆర్‌ జిల్లా పటమటకు చెందిన సీహెచ్‌ అచ్యుత్‌ కిరణ్‌ అనే ప్రైవేటు కాంట్రాక్టర్ ఏపీ-39 టీవీ 999 నంబరు కారును అద్దెకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌ ఒకటిన కారును కార్యాలయానికి అప్పగించగా అప్పట్నించి డీఈఈ పూర్ణచంద్రరావు ఈ వాహనాన్ని వినియోగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు.


కారు అద్దెకు ఇచ్చిన అచ్యుత్‌కిరణ్‌ తరచూ కార్యాలయానికి వచ్చి సర్వీసింగ్‌ చేయించుకొని వస్తానంటూ వాహనాన్ని తీసుకొని వెళ్లడం.. అప్పుడప్పుడు వచ్చి తనిఖీ చేసేవాడు. కిరణ్ తీరుపై విద్యుత్‌శాఖ అధికారి పూర్ణచంద్రరావుకు గతంలోనే అనుమానం వచ్చింది. కొంతకాలంగా ఈయన అక్రమ విద్యుత్తు వినియోగదారుల దగ్గరకు ఆకస్మికదాడులకు వెళ్లే సమయాల్లో ఆయన కదలికలు ముందుగానే వినియోగదారులకు తెలిసిపోతోంది. అధికారి చేపట్టిన ఆకస్మికదాడుల వల్ల ఉపయోగం లేకుండ పోయింది.. దీంతో తన కదలికలను ఎవరో పసిగడుతున్నట్లు పూర్ణచంద్రరావుకు అనుమానం వచ్చింది.


పూర్ణచంద్రరావుకు అనుమానం పెరగడంతో.. ఈయన అద్దెకు తీసుకున్న కారును మెకానిక్‌‌ను తీసుకొచ్చి చెక్ చేయించాడు.. అప్పుడు అసలు సంగతి బయటపడింది. కారు స్టీరింగ్‌ కింద మాప్‌ మై ఇండియా అనే కంపెనీకి చెందిన సిమ్‌ కార్డు ఉన్న జీపీఎస్‌ ట్రాకర్‌ కనిపిండంతో పూర్ణచంద్రరావు అవాక్కయ్యారు. అప్పట్నించి కారును ఉపయోగించడం మానేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం తన గురించి సమాచారాన్ని, కదలికలను ఎవరెవరికి అందజేస్తున్నావంటూ కాంట్రాక్టర్‌ అచ్యుత్‌ కిరణ్‌ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెబుతూ తన వెనుక పెద్ద పెద్ద వాళ్లున్నారంటూ బెదిరింపులు మొదలు పెట్టాడు.


ఈ జీఎస్ ట్రాకర్ వ్యవహారంపై విద్యుత్తు శాఖ డీఈఈ పూర్ణచంద్రరావు తన కదలికలపై జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా గుర్తించి విద్యుత్తు శాఖకు నష్టం కలిగించేలా వ్యవహరించడం.. అలాగే శాఖలోని తనంటే గిట్టనివారికి సమాచారాలు ఇస్తూ వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతకు భంగం కలిగించిన అచ్యుత్‌ కిరణ్‌, ఇతడిని ప్రేరేపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు అచ్యుత్‌ కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa