ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేసిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:50 PM

ఎన్నికల సమయంలో నేతలు ఎన్నో రకాల విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు పొరపాటున చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. ఆ సమయంలో ప్రత్యర్థులు అదే అదనుగా అలాంటి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా పోలీస్ కేసులు కూడా నమోదు చేస్తూ ఉంటారు. ఇక 2017 గోవా ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా విచారణ జరిపిన గోవాలోని మపుసా కోర్టు.. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. దీంతో 2017 గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌పై నమోదైన కేసులో ఆయనకు భారీ ఊరట లభించింది.


2017 లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. అన్ని పార్టీలు, అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు అయిన చీపురుకే వేయండి అని అరవింద్ కేజ్రీవాల్ ఆ బహిరంగ సభ నుంచి గోవా ఓటర్లకు సూచించారు. దీంతో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.


ఈ వ్యాఖ్యలకు గాను ప్రజాప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ సెక్షన్ 171 (ఇ) లో భాగంగా లంచానికి సంబంధించిన కేసు అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గతేడాది నవంబర్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. 2017, 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసింది. అయితే 2017లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ.. 2022 ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లను గెలుచుకుంది.


అయితే 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమోదైన ఈ కేసు విచారణ దాదాపు 7 ఏళ్లు సాగింది. చివరికి శనివారం కీలక తీర్పు వెల్లడించిన గోవాలోని మపుసా కోర్టు కేజ్రీవాల్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను తిరస్కరించింది. ఇక ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. జైలు నుంచే ఢిల్లీ పాలనా వ్యవహారాలను చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa