ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ కేసులో త్వరలోనే జైలు నుంచి వస్తానన్న మనీష్ సిసోడియా.. షాక్ ఇచ్చిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:52 PM

ఢిల్లీ లిక్కర్ కేసు కుంభకోణంలో చిక్కుకుని ఆమ్ ఆద్మీ పార్టీ విలవిలలాడుతోంది. ఇటీవలే ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాగా.. అంతకుముందే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తాజాగా విడుదల అయ్యారు. ఇక ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరికొంతమంది ఆప్ నేతల పేర్లు కూడా విచారణలో బయటికి వచ్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మొట్టమొదట అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా.. తాను త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తానని ఇటీవలె తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి మనీష్ సిసోడియాకు చుక్కెదురైంది. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 18 వ తేదీ వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియాను హాజరుపరచగా.. స్పెషల్ జడ్జి కావేరీ బవేజా.. కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలోనే వాదించిన మనీష్ సిసోడియా.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఈడీ, సీబీఐలు ఇంకా రుజువు చేయలేదని పేర్కొన్నారు.


ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ తరఫున మొట్టమొదట అరెస్ట్ అయింది మనీష్ సిసోడియా. 2023 ఫిబ్రవరి 26 వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 28 న ఢిల్లీ కేబినెట్‌ నుంచి తప్పుకున్న సిసోడియా.. తన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2023 అనంతరం మార్చి 9 వ తేదీన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు కూడా మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసులో ఎన్నిసార్లు ప్రయత్నించినా మనీష్ సిసోడియాకు మాత్రం బెయిల్ దొరకలేదు.


ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఢిల్లీలోని పట్పర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తీహార్ జైలు నుంచే ఒక లేఖ రాశారు. తాను త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని.. తొందర్లోనే అందర్నీ కలుస్తానని ఆ లేఖలో మనీష్ సిసోడియా పేర్కొన్నారు. తప్పుడు కేసులో తనను జైల్లో పెట్టారని.. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపిన మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా తనకు ఆదర్శమని మనీష్ సిసోడియా వెల్లడించారు. జైలుకు వెళ్లిన తర్వాత పట్పర్ గంజ్ నియోజకవర్గ ప్రజలపై ప్రేమ మరింత పెరిగిందని.. తనకు ప్రజలే బలమని పేర్కొన్నారు. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటానని నియోజకవర్గ ప్రజలకు సిసోడియా ధీమాగా చెప్పగా.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఆయన కస్టడీని పొడిగించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa