మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో.. చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతుండగా.. నాగబాబుతో కలిసి అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గర్నుంచి చెక్ అందుకున్నారు. అనంతరం తన అన్నయ్య చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి అరగంట సేపు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నారు.
వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఎన్నికల ప్రచారాన్ని సైతం ఆపేసి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చిరంజీవి నుంచి పిలుపు రావడంతో పవన్ కళ్యాణ్ ముచ్చింతల్ వెళ్లి విరాళాన్ని స్వీకరించారు. వాస్తవానికి సోమవారం అమావాస్య, పైగా సూర్యగ్రహణం. సాధారణంగా సెంటిమెంట్లు ఫాలో అయ్యేవారు అమావాస్య రోజున ఏదైనా మంచి పని ప్రారంభించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. గ్రహణం ఏర్పడటానికి దాదాపు 9 గంటల ముందు నుంచే సూతకాలం ప్రారంభం అవుతుందని భావిస్తారు. అఫ్కోర్స్ ఇండియాలో గ్రహణం కనపించలేదు కాబట్టి.. దాని ప్రభావమూ ఉండదనుకుంటే... చిరంజీవి అమావాస్య రోజున తన తమ్ముడి పార్టీకి భారీ విరాళం ఇచ్చారేంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే చిరంజీవి అలా చేయడానికి కారణం లేకపోలేదు. సోమవారం అమావాస్య మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా. చిరంజీవి జనసేనకు విరాళం ఇవ్వడానికి ఆ రోజును ఎంపిక చేసుకొని ఉండటానికి బహుశా అదే కారణం కావచ్చు. మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ముందు నిలబడి.. చిరంజీవి చేతుల మీదుగా చెక్ అందుకున్న జనసేనాని.. పెద్దన్నయ్య కాళ్లు మొక్కి మరీ ఆయన ఆశీస్సులు పొందారు. హనుమాన్ చెంతనుండగా.. ఇక అమావాస్య ఏంటి..?
జనసేన పార్టీకి ఏకంగా రూ.5 కోట్లు విరాళం ఇవ్వడం ద్వారా తన తమ్ముడికి అన్ని విధాలా తన అండగా ఉంటానని చిరంజీవి సంకేతాలిచ్చారు. జనసేనకు విరాళం ఇచ్చాక మెగాస్టార్ చేసిన పోస్టు దీన్ని ధ్రువపరుస్తుంది. ‘‘అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను.’’ అని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇప్పుడు చిరంజీవే స్వయంగా తన తమ్ముడిని పిలిచి చెక్ చేతులో పెట్టి ఆశీర్వదించారు. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ నుంచి యువ హీరోలు వచ్చి జనసేన తరఫున ప్రచారం చేయడమే. పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతుండటం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. రామ్ చరణ్ తేజ్, సాయి దుర్గ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఈ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa