ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో డ్రగ్స్ ఒకటి. ప్రజలను డ్రగ్స్కు బానిసలను చేసి.. వాటి ద్వారా వందలు, వేల కోట్ల రూపాయలు పోగేస్తున్నారు. అంతేకాకుండా దేశ, విదేశాలకు ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తూ.. ఇంటర్నేషనల్ డ్రగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ డ్రగ్స్ బారిన పడినవారు.. డబ్బులన్నీ ఖర్చుచేస్తూ, ఆరోగ్యం పాడు చేసుకుని చివరికి ప్రాణాలు వదిలేస్తున్నారు. అయితే రకరకాల డ్రగ్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో మనుషుల ఎముకల నుంచి తయారు చేసే కుష్ డ్రగ్స్ కూడా ఒక రకం. ఈ కుష్ డ్రగ్స్ను తయారు చేసేందుకు డ్రగ్స్ ముఠాలు ఏకంగా శ్మశానాలనే తవ్వేస్తున్నాయి. వందలాది సమాధులను తవ్వి అందులోని అస్థిపంజరాలను సేకరించి వాటి నుంచి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియెన్లో మత్తు పదార్థాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మాదకద్రవ్యాల సమస్యలతో ఆ దేశం తీవ్రంగా సతమతమవుతోంది. ఇక సియెర్రా లియోన్లో పరిస్థితి చేయిదాటడంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. సియెర్రా లియోన్లో చాలామంది యువకులు ఒక రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో ఎక్కడికక్కడ పడిపోతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్ బయో ఇటీవల ఎమర్జెన్సీ విధించారు. సియెర్రా లియోన్ ఎదుర్కొనే అతిపెద్ద సమస్యనే కుష్ అనే డ్రగ్స్. ఈ కుష్ డ్రగ్స్ సేవించి అక్కడి జనం మత్తులో ఊగిపోతున్నారు. ఈ కుష్ డ్రగ్స్.. 6 ఏళ్ల క్రితం సియెర్రా లియోన్ దేశంలోకి ప్రవేశించింది.
ఎప్పుడూ అంతర్గత ఘర్షణలు, జాతుల మధ్య వైరంతో ఆ దేశంలో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో అక్కడి యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వారు కుష్ అనే మనుషుల ఎముకలతో తయారు చేసిన డ్రగ్స్కు బానిసలు కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సియెర్రా లియోన్ దేశంలోని ప్రధాన పట్టణాల ఎక్కడ చూసినా యువకులు కుష్ మత్తులో ఊగిపోతున్నారని స్థానిక మీడియా తెలిపింది.
ఇక ఈ కుష్ డ్రగ్స్ను తయారు చేసేందుకు మనుషుల ఎముకలను కూడా వాడతారు. ఈ కుష్ డ్రగ్స్కు భారీగా డిమాండ్ ఉండడంతో.. డ్రగ్ డీలర్లు శ్మశానాల వెంట పడుతున్నారు. దొంగలకు డబ్బులు ఇచ్చి సమాధులను తవ్వి అస్థిపంజరాల నుంచి ఎముకలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు సియెర్రా లియోన్ దేశంలో వందలాది సమాధులను తవ్వినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. దీంతో శ్మశానాల వద్ద అక్కడి ప్రభుత్వం పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఫ్రీటౌన్ వంటి పెద్ద పట్టణాల్లో సమాధుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల దేశ అస్థిత్వానికే ముప్పు ఏర్పడిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుషు డ్రగ్స్ తీసుకుంటున్న వారి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. దీని బారి నుంచి జనాన్ని బయటికి తీసుకువచ్చేందుకు ప్రతీ జిల్లాలో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక డ్రగ్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల వందలాది మంది యువకులు ఈ కుషు డ్రగ్ కారణంగా అవయవాలు దెబ్బతిని చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ముఖాలు వాచిపోయి శరీరమంతా గాయాలతో చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వెల్లడించారు. ఇలా చేరుతున్న వారి గత 3 ఏళ్లలో 4 వేల శాతం పెరిగినట్లు చెప్పారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa