ఏపీ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై ఎన్డీయే కూటమి దృష్టిసారించింది. ఈ మేరకు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య శుక్రవారం కీలక భేటీ జరిగింది. తాడేపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి భేటీ జరిగింది. దాదాపు 2 గంటలకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రచారంతో పాటు, సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నేతలు చర్చించారు. కీలకమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా ఎన్డీయే కూటమి ఎంపిక చేసింది. ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవల్, అసెంబ్లీ లెవల్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు, వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఖరారు చేశారు. ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా నేతలు మాట్లాడుకున్నారు. చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళ్తున్నారని, ఇది మంచి పరిణామమని నేతలు అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లో జరిగిన కూటమి సభల గ్రాండ్ సక్సెస్పై నేతలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా... ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. కాగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. ఇక మూడు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని, అధికార పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని నేతలు పేర్కొన్నారు. 25 పార్లమెంట్ సీట్లు, 160 పైగా అసెంబ్లీ సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళిక ఉండేలా వ్యూహంతో వెళ్లాలని నేతలు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa