ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీతో గేమ్ ఆడిన సొట్టబుగ్గల సుందరి.. ఎవరీ పాయల్ ధరే?

national |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 10:05 PM

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌ ఆడి బాగా పాపులారిటీ సాధించిన కొందరు గేమర్లతో భేటీ అయి ముచ్చటించారు. వారితో కొద్దిసేపు గేమ్ కూడా ఆడారు. ఈ గేమర్స్‌లో యువతీయువకులు ఉన్నారు. అయితే అందరిలో ఒక సొట్టబుగ్గల సుందరి పాయల్ ధరే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో ఈ పాయల్ ధరే ఎవరా అంటూ నెటిజన్లు.. ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. ఇటీవల గేమర్లతో తాను పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోను తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అందులో పాయల్ ధరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్‌లో ఫేమస్ అయిన కొంతమంది గేమర్లతో ప్రధాని మోదీ మాట్లాడారు. గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి ఆయన వారితో చర్చించారు. అలాగే మన పురాణాల ఆధారంగా గేమ్స్ రూపకల్పన గురించి, ఈ గేమింగ్ రంగంలో కెరీర్‌ ఎంచుకుంటున్నవారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు. అయితే మొత్తం ఏడుగురు గేమర్లు ప్రధానితో సంభాషించగా.. అందులో ఓ అమ్మాయి మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియా, ఇంటర్నెట్‌ల ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ప్రధానితో ఎంతో బాగా మాట్లాడిన ఈ సొట్ట బుగ్గల సుందరి ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.


వివిధ రాష్ట్రాలకు చెందిన తీర్థ్‌ మెహతా, అనిమేశ్‌ అగర్వాల్‌, అన్షు బిష్త్‌, నమన్‌ మథుర్‌, మిథిలేశ్‌ పటాంకర్‌, గణేశ్ గంగాధర్‌తో పాటు పాయల్‌ ధరే కూడా ప్రధానితో సమావేశం అయిన వారిలో ఉంది. పాయల్ ధరే స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడాలోని ఉమ్రానాలా గ్రామం. గేమింగ్‌తో పాపులర్ అయిన పాయల్ ధరేకు ‘పాయల్ గేమింగ్’ అనే ఛానల్ ఉంది. అంతేకాకుండా ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ-ఐజీసీలో కూడా ఆమె ఒకరు.


ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి తన కుమార్తెకు పిలుపు వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషం కలిగిందని.. పాయల్ ధరే తండ్రి శివశంకర్ ధరే పేర్కొన్నారు. ఏకంగా ప్రధానితో కూర్చొని తన కుమార్తె గేమ్ ఆడటం అనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని తెలిపారు. ప్రధానితో సమావేశం అయి పాయల్ ధరే.. తమ ఊరుకు ఎంతో పేరు తీసుకువచ్చిందని ఇప్పుడు తన ఉమ్రానాలా గ్రామ ప్రజలు చెబుతుంటే ఎంతో గర్వంగా ఉందని శివశంకర్ ధరే ఆనందం వ్యక్తం చేశారు.


‘గేమింగ్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పాయల్ ధరే ఈ ఏడాది మార్చిలో అందుకుంది. గతేడాది ‘డైనమిక్ గేమింగ్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం కూడా ఆమెను వరించింది. అంతేకాకుండా ‘ఫిమేల్‌ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను కూడా పాయల్ ధరే దక్కించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పాయల్ ధరే.. ప్రధానితో కలిసి గేమింగ్ ఇండస్ట్రీ ప్యూచర్ గురించి చర్చించడం గర్వంగా అనిపించిందని.. దేశం కోసం ఏదైనా చేయాలనే ఆయన సంకల్పం ఎంతో గొప్పదని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com