ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడలో జరిగిన రాళ్లదాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ మీద జరిగిన దాడిని ఖండించారు. ముఖ్యంగా అత్యంత పటిష్ఠ బందోబస్తు కలిగిన ముఖ్యమంత్రిపైనా రాయితో దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ .. ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేయడానికి పార్టీలన్నీ ఖండించాయి. కారకులైనా వారిని గుర్తించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇక ముఖ్యమంత్రిపైనే దాడి జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.
సీఎం జగన్ పై దాడికి సంబంధించి విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో పోలీస్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై వేగంగా దర్యాప్తు కోసం సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో దాడి చేసిన దుండగుల వివరాలను కనుక్కునేందుకు మరో పద్ధతి కూడా పోలీసులు ఫాలో అవుతున్నారు. దుండగుల వివరాలు చెప్పినవారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి చేసిన దుండగుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ మీద దాడిచేసిన వారి వివరాలు తెలపాలంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దుండగులను గుర్తించేలా సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్ వంటి సమాచారం ఉన్నా కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. దుండగుల గురించి సమాచారం అందించిన వారికి రూ.2 లక్షలు రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. వివరాలు తెలిసినవారు నేరుగా వచ్చి పోలీసులను కలవవచ్చని.. అలాగే సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. వివరాలను తెలియజేసేందుకు ఫోన్ నంబర్లు సైతం ఏర్పాటు చేశారు.
ఫోన్ నంబర్లు
1. కంచి శ్రీనివాసరావు, డీసీపీ, ఎన్టీఆర్ పోలీస్ కమీషనరేట్ - 9490619342
2. ఆర్.శ్రీహరిబాబు, ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ – 9440627089
అడ్రస్:
కమీషనర్స్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట, కృష్ణ లంక, విజయవాడ
మరోవైపు ఈ దాడిలో జగన్ ఎడమ కన్ను పైభాగంలో గాయమైంది. వైఎస్ జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి సైతం తీవ్ర గాయమైంది. గాయానికి ఒకరోజు చికిత్స తీసుకున్న వైఎస్ జగన్ సోమవారం నుంచి తిరిగి తన మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa