ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి చెబితే నీకెందుకంత బాధ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 09:11 AM

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోనని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలలో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ‘సజ్జల పులివెందుల నుంచి వచ్చారో.. ఫ్యాక్షన్‌ నేపథ్యం నుంచి వచ్చారో తెలియదు, సింహం సింగిల్‌గా వస్తుందంటాడు.. కానీ రాష్ట్రాన్ని దోచుకున్న పందుకొక్కల సమూహం మీది. మీ అందరికీ డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువయ్యాయి. సజ్జలను హెచ్చరిస్తున్నా.. మా అన్న చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికి గానీ, శెట్టి బలిజ, కాపు, ఎస్సీ, ఎస్టీ.. ఇలా ఏ సామాజికవర్గం జోలికి గానీ వచ్చినా ఊరుకోను. చిరంజీవి జనసేనకు రూ.5 కోట్లు ఇచ్చి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ను కూడా విరాళం ఇవ్వమని చెప్పినందుకు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ (అనకాపల్లి లోక్‌సభ), పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి)ను గెలిపించాలని సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి చెబితే.. సజ్జలా నీకెందుకంత బాధ? ఒక్కసారి అద్దాల్లో మీ ముఖాలు చూసుకోండి. సింహాల్లా కాదు.. గుంటనక్కల్లా ఉన్నారు. మీరు కలుగుల్లో పందికొక్కుల సమూహం.. చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కూడా తిడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు చాలా సాఫ్ట్‌గా ఆలోచించేవారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. దుర్మార్గులపై కఠినంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. ఆయనకు నేను తోడు. జగన్‌ అండ్‌ కోకు ఎదురుదెబ్బ తప్పదు. నరసాపురం గడ్డ నుంచి చెబుతున్నా.. సజ్జలా.. నువ్వు, మీ జగన్‌ పద్ధతులు మార్చుకోండి. లేదంటే కూటమి ఆధికారంలోకి వచ్చాక రోడ్డుపై మోకాళ్లపై దేకిస్తా’ అని స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa