ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ నాయకత్వం మార్చింది. వెంకటగిరి, ఉండి, మాడుగుల, పాడేరు(ఎస్టీ), మడకశిర (ఎస్సీ) స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు స్థానంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. పెందుర్తిని జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేశ్నాయుడికి కేటాయించగా.. తాజాగా ఆయన్ను మార్చి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. మడకశిరను సునీల్కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు కేటాయించారు. వెంకటగిరి స్థానాన్ని మొదట మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియకు కేటాయించారు. అయితే ఇప్పుడు రామకృష్ణనే ఖరారు చేసి బీఫాం అందించారు. కాగా.. పెండింగ్లో ఉన్న అనపర్తి టికెట్ వ్యవహారం పరిష్కారమైంది. అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి సమ్మతించారు. నల్లమిల్లి చేరిక, టికెట్ ఖరారుపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడ్డాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులపై టీడీపీ నిర్ణయం వెలువడనుంది. దెందులూరులో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు గతంలోనే ప్రకటించారు. ఆయనకు సోమవారం బీఫారం ఇచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డి కొనసాగించడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయంగా సరళారెడ్డి, శంకర్ యాదవ్, కొండా నరేంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ కూడా సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు.. రఘురామరాజు కోసం ఉండి సీటు వదులుకున్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్బ్యూరోలోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కొమ్మి లక్ష్మయ్యనాయుడిని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa