పోస్టల్ బ్యాలెట్కు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే 23 వేలమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రణాళికా లోపం కారణంగా గందరగోళంగా మారాయి. కేంద్రంలో తోపులాటలు, గొడవలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహిస్తారు. విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాలకు కామన్గా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ (ఐజీఎంసీ) స్టేడియంలో ప్రధాన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానికంగా ఎక్కడి వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునే విధంగా చూడాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలో ఏడు వేలమందిని పంపి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయించగలిగితే.. మిగిలిన ఏడు వేలమందిని ఐజీఎంసీలో ఓటు వేయించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించే పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ కౌంటర్లు, రద్దీ లేకుండా ఉండటానికి పటిష్ట బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్కు బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులైనా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా జిల్లాల బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa