ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు ముమ్మురం చేశారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో తనిఖీలు, సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీదిరి అప్పలరాజు వాహనాన్ని ఓ కూడా లేడీ ఆఫీసర్ ఆపారు. దీంతో ఆగ్రహించిన మంత్రి.. సదరు లేడీ ఆఫీసర్ మీద రుసరుసలాడారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలాస నియోజకవర్గంలో శుక్రవారం సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎన్నికల ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత శుక్రవారం ఆపారు. దీంతో మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహానికి గురయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆశాలత వైసీపీ ప్రచార రథాన్ని ఆపడంపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథం, లక్ష రూపాయలు ఆవిడకు ఇచ్చేయండని అనుచరులను ఆదేశించారు. మీ ఇష్టం వచ్చినట్లు ప్రచార రథాన్ని డెకరేట్ చేసివ్వండి.. తరువాత వాడుకుంటామంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రచార రథాలు లేవా.. పలాసలోనే ఉన్నాయా.. ఏంటి ఈ టార్చర్ మాకు అంటూ సీదిరి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు. అయితే తాము రూల్స్ ప్రకారం వెళ్తున్నామని.. నిబంధనల్లో ఉండేవే చెప్తున్నామంటూ ఆశాలత బదులిచ్చారు. దీనిపై మండిపడిన మంత్రి.. 175 నియోజకవర్గాల్లో లేని నిబంధనలు, పలాసలోనే ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఎన్నికల అధికారికి మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రచార రథం ఆపితే బాగోదంటూ హెచ్చరించారు. మీరొక్కరే విధులు నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నికల అధికారిని బెదిరించటం ఏమిటని కొంతమంది నెటిజనం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పలాస అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజుకే మరోసారి అవకాశం ఇచ్చింది. టీడీపీ తరుఫున గౌతు శిరీష బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మజ్జి త్రినాధబాబు పోటీ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa