ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్ వేస్తాం ఊరెళ్లు.. నెట్టింట జనసేన వర్సెస్ కోనవెంకట్.. మంట పెట్టిన ఫోటోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:23 PM

సినీ రచయిత కోన వెంకట్, జనసైనికుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. రెండు వర్గాలు కామెంట్లు, రిప్లైలతో ఏ మాత్రం తగ్గట్లేదు. అసలు సంగతిలోకి వస్తే కోన వెంకట్ అప్పుడప్పుడూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు గట్రా పెడుతూ ఉంటారు. ఎన్నికల నేపథ్యం కావటంతో ఇది ఈ మధ్య మరింత ఎక్కువైంది. తాజాగా బాపట్లలోని జగనన్న కాలనీకి సంబంధించి ఫోటోలను కోనవెంకట్ షేర్ చేశారు.


ఇది అభివృద్ధి చెందిన హైదరాబాద్ లోని ఏ విల్లాస్ వెంచరో కాదండీ. మా బాపట్లలో నిర్మించిన "జగనన్న కాలనీ" అంటూ ఫోటోలను పంచుకున్నారు. సొంతింటి కలను నిజం చేసుకున్న శాంతకుమారి,షేక్ షర్మిల కుటుంబాలని కలిసిన తర్వాత అంటూ లబ్ధిదారులతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్నారు.అలాగే ఇదే నిజమైన అభివృద్ధి అని నా అభిప్రాయం, నిజం చెప్పకపోతే అబద్దాన్ని ప్రోత్సహించినట్టే కదండీ అంటూ అందులో రాసుకొచ్చారు.


అయితే కోనవెంకట్ చేసిన ఈ ట్వీట్‌కు జనసేన కౌంటర్ ఇచ్చింది. "పెయిడ్ ఆర్టిస్ట్ లకు విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి 1.5 లక్షలు కేటాయిస్తే, కేవలం 30 వేలు మాత్రమే వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. కోన వెంకట్ గారు కనీస అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం మానుకుంటే మంచిది. పేదల ఇళ్ల పేరిట, జగనన్న కాలనీల పేరిట మీ ప్రభుత్వం చేసిన దోపిడీ అనేది ఏ స్థాయి అనేది ముందుగా తెలుసుకుంటే మంచిది, లేదంటే లేని గౌరవం కోల్పోతారు కోనా గారు." అంటూ ట్వీట్ చేసింది.


అయితే కోన వెంకట్ అక్కడితో అగలేదు. జనసేన రిప్లైకి మరోసారి కౌంటర్ ఇచ్చారు. మా సొంతూరు బాపట్లలో నా కళ్లతో చూసిన అభివృద్ధి గురించే తాను పోస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. అలాగే తాను కేంద్ర ప్రభుత్వ సహాయం గురించి వివరాలు తెలుసుకున్నానని.. ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షా 80 వేలు అకౌంట్లలో వేస్తోందని చెప్పారు. అలాగే జగనన్న కాలనీల కోసం ఉచితంగా భూమిని అందించిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఆలోచన గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అభిప్రాయాలను వెల్లడించిన వారిని పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ట్రోల్ చేయడం మీకు తగునా అంటూ జనసేనను కోనవెంకట్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి, సీఎంకు మద్దతుగా మాట్లాడేవారిని దుర్భాషలాడటం తగదని అన్నారు.


అయితే కోన వెంకట్ ట్వీట్‌కు జనసేన కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. " మీ కళ్ళు 10 పూర్తయిన ఇళ్లు చూస్తే, ప్రజల కళ్ళు 10 లక్షల పూర్తికాని ఇళ్లను చూస్తున్నాయి. గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్లను ఇవ్వకుండా ఇప్పటిదాకా పేదల సొంత ఇంటి కల అడ్డుకుంది వైఎస్ జగన్. నువ్వు స్థలం ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పావ్ కదా, ఆ భూములను మార్కెట్ ధర కంటే పదింతల అధిక ధరకు వైసీపీ నాయకుల నుంచి కొనుగోలు చేసింది నిజం కాదా? జగనన్న కాలనీల పేరిట 35వేల కోట్ల అవినీతి చేసింది నిజం కాదా?" అని ప్రశ్నించింది.


" మంజూరైన ఇళ్లలో దాదాపు 90% ఇళ్లు కనీసం బేస్మెంట్ కూడా వేయకుండా వదిలేసింది నిజం కాదా? ప్రభుత్వ రాజముద్ర ఉండాల్సిన ఇంటి పత్రాలపై జగన్ దిష్టి బొమ్మ వేసుకుంది నిజం కాదా? 5 ఏళ్లుగా పేదలు గృహప్రవేశం కోసం ఎదురు చూసింది నిజం కాదా? కేంద్రం నిధులు ఇస్తాం ఇల్లు పూర్తి చేయండి అని చెప్పినా సరే నిధులు లేక నిర్మాణం ఆపింది నిజం కాదా? చెప్పుకుంటూ పోతే నువ్వు ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తున్న ఇళ్ల వెనుక అవినీతి బాగోతంలో వైసీపీ నేతలు అందరూ ఉన్నారు. కావాలంటే జనసైనికులు నీకు గుంకలాం గ్రామానికి టిక్కెట్ వేస్తారు, ఒక్కసారి వెళ్లి జగనన్న కాలనీలు చూసి వచ్చి మాట్లాడండి" అంటూ కోన వెంకట్‌కు జనసైన కౌంటర్ ఇచ్చింది. అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉందన్న జనసేన. జరిగిన దానిలో 90 శాతం అవినీతి ఉన్నప్పుడు, దాని గురించి ఏరోజు మాట్లాడకుండా, కేవలం ఎన్నికల ప్రచారం కోసం వచ్చి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితేనే లేని గౌరవం కోల్పోతారని ట్వీట్ చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa