ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌కల్యాణ్‌కు కులమే లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 08:46 PM

ప్రజాతీర్పుతో వైసీపీ అహంకారం అంతమవుతుందని, జూన్‌ 4న వేడుకలకు సిద్ధం కావాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. గొల్లప్రోలు పట్టణంలోని సత్యకృష్ణ ఫంక్షన్‌హాలులో బుధవారం జరిగిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలింగ్‌బూత్‌ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తారని ప్రకటించిన నాటి నుంచి ఈవీఎంలో ఆఖరి ఓటుపడే వరకూ అలుపెరగకుండా పనిచేసిన, శ్రమించిన జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు ఆయన అభినందనలు తెలియజేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అందరూ బలంగా నిలబడ్డారని, ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎవరూ కులమతాలు గురించి మాట్లాడవద్దని, పవన్‌కల్యాణ్‌కు కులమే లేదని తెలిపారు. జనసైనికులకు ఆవేశం ఉండవచ్చని, అనవసర ఆవేశం వద్దని చెప్పారు. తప్పు ఎక్కడయినా జరిగితే నిలదీయాలని సూచించారు. కార్మికుల కష్టానికి చిహ్నమైన ఎర్ర తువ్వాలు తొలగించాలని పలు చోట్ల వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీతను మర్యాదగా పలకరించాలని, ఆడపడుచుగా గౌరవించాలన్నారు. అంతే తప్ప ఎగతాళి చేయవద్దని తెలిపారు. అది జనసేన సిద్ధాంతం కాదన్నారు. ఆమె ప్రస్తుతం చెడువైపు నిలబడిందని చెప్పారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బి.మహేందరరెడ్డి, వేములపాటి అజయకుమార్‌, మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్‌ పంచకర్ల సందీప్‌, తుమ్మలపల్లి రమేష్‌, అనిశెట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా పిఠాపురంలో ఎన్‌ఆర్‌ఐ అనిశెట్టి స్వామి ఆధ్వర్యంలో యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు అందించిన సేవలు అభినందనీయమని నాగబాబు పేర్కొన్నారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్‌ ముగిసేవరకూ వారు అందించిన సేవలను ప్రశంసించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa