ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ దాడుల‌పై గవర్నర్ కి వైసీపీ నేతల పిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 11:45 AM

పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైయ‌స్ఆర్ సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల బృందం గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ సీపీ బృందం గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని కలిసింది. టీడీపీ దాడుల‌పై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు నేత‌లు ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యంపై కూడా వైయ‌స్ఆర్ సీపీ ఫిర్యాదు చేసింది. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వారిలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మనోహర్ నాయుడు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం పోలీసు అధికారులను భర్తీ చేసిన తర్వాత హింసాత్మక సంఘటనలు పెరిగాయ‌ని, పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలతో పాటు వివిధ జిల్లాల్లో పోలీసు అధికారుల లోపాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం నియమించిన ఐపీఎస్ (రిటైర్డ్) పోలీసు అబ్జ‌ర్వ‌ర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించడంపై వైయ‌స్ఆర్ సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. మిశ్రా టీడీపీ కార్యకర్తలతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తూ తనకు అప్పగించిన బాధ్య‌త‌కు తూట్లు పొడిచాడ‌ని వైయ‌స్ఆర్ సీపీ ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు ప్రతిపక్షాల చేసే హింసను తీవ్రతరం చేసేలా కనిపించిన పోలీసుల ఏకపక్ష తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడుల‌కు కారణమైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో గవర్నర్‌ను అభ్యర్థించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa