బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వాగులు, వంకలకు నీటి ప్రవాహం మొదలైంది. ఇప్పటికే మండుటెండలకు కర్నూలు జిల్లాలోని వాగులు, వంకలతో పాటు హంద్రీ, తుంగభద్ర నదుల్లో చుక్కనీరు లేని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు నగరం మీదుగా ప్రవహిస్తున్న హంద్రీనదిలో నీటి ప్రవాహం మొదలైంది. తుంగభద్ర నదికి ఎగువ ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహం మొదలైనట్లు నీటి పారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ద్రోణి ప్రభావంతో జూన్ మొదటి వారంలో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నాయనీ, దీని వల్ల ఖరీఫ్ సీజన్కు సంబంధించి వర్షాలు మొదలవుతాయనీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కల్లూరులో 52.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కాగా కర్నూలు అర్బన్లో 22.6, కర్నూలు రూరల్ 14, మద్దికెరలో 10.2, ఓర్వకల్లులో 4.6 మి.మీ., మేర వర్షం కురిసింది. మే నెలలో సగటున 40.1 మి.మీ., వర్షం కురవాల్సి ఉండగా.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 76.4 మి.మీ., వర్షం నమోదైంది. సాధారణం కంటే అదనంగా 36 మి.మీ., వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa