‘ఎస్సీలు, ఎస్టీలు, పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై ‘ఫ్రీ హోల్డ్ హక్కులు’ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ 596ను అమలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మంగళవారం లేఖ రాశారు. ఆర్థికంగా వెనుకబడినవారు, భూములు లేనివారికి షరతులపై ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇచ్చిందని శర్మ తన లేఖలో గుర్తు చేశారు. ఇది కూడా సంక్షేమ పథకాల్లో భాగమేనన్నారు. ఆయా భూములను వారు ఉపయోగించుకునేలా, వ్యవసాయం చేసుకుని కుటుంబాలను పోషించుకునేలా తగిన సహకారం అందివ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఆ భూములు మూడో వ్యక్తికి చేరితే అది పథకాన్ని తప్పుదోవ పట్టించినట్టేనన్నారు. ఆ భూములకు ప్రజల తరఫున ప్రభుత్వమే ట్రస్టీగా ఉండి కాపాడాలని, ఎవరైనా ఆయా భూములను వారి పేర్ల మీదకు బదలాయించుకుంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటిని స్వాధీనం చేసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. అలాంటి భూములను నిరుపేదలైన మరికొందరికి కేటాయించవచ్చునన్నారు. అలా కాకుండా ‘ఫ్రీ హోల్డ్ హక్కు’ పేరుతో ఉత్తర్వులు ఇచ్చిన వాటిని వేరే వారికి క్రమబద్ధీకరించడం అన్యాయం కిందికే వస్తుందని, ప్రజా విశ్వాసం ప్రధాన సూత్రాన్ని ఉల్లంఘించినట్టేనని పేర్కొన్నారు. ఈ జీఓను ఇనాం చట్టానికి కూడా వర్తింపజేశారని, తక్షణమే ఈ జీఓ అమలును నిలిపివేసి, ఇప్పటివరకూ జరిగిన వ్యవహారాలపై విచారణ చేయించాలని గవర్నర్ను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa