కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వ ఏర్పాటు కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతుండటంతో రాజకీయ స్థిరత్వంపై మదుపరులకు భరోసా వచ్చింది. దీంతో వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మరోసారి సెన్సెక్స్ 75 వేల మార్కు దాటింది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి రూ. 83.53 వద్ద ముగిసింది. ఇదే క్రమంలో బ్యారెల్ ముడి చమురు ధర 78.43 డాలర్ల వద్ద ఉంది. ఇంకా మదుపరుల సంపదగా భావించే.. BSE నమోదిత సంస్థల మార్కెట్ విలువ గురువారం ఒక్కరోజులోనే రూ. 7.83 లక్షల కోట్ల మేర పెరిగింది.
ఇక బుధవారం రోజు కూడా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 13.22 లక్షల కోట్లు పెరగ్గా.. ఈ రెండు రోజుల్లో కలిపితే ఇన్వెస్టర్ల సంపద రూ. 21.05 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఇప్పుడు ఇన్వెస్టర్ల మొత్తం సంపద రూ. 415.89 లక్షల కోట్లు దాటింది. ఇవాళ మార్కెట్లు ఇంకా పుంజుకుంటున్న క్రమంలో ఇది ఇంకా భారీగా పెరిగిందని చెప్పొచ్చు. సెన్సెక్స్ ఉదయం 75,078.70 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభం కాగా.. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇక 75,297.73 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. తర్వాత 692.27 పాయింట్ల లాభంతో 75,074.51 వద్ద సెషన్ ముగించింది. ఇక నిఫ్టీ 201.05 పాయింట్లు పెరిగి 22,821.40 వద్ద స్థిరపడింది.
>> అదానీ పవర్ నుంచి భెల్ (BHEL) రూ. 3500 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకున్న క్రమంలో ఈ స్టాక్ ఏకంగా 8.85 శాతం దూసుకెళ్లి రూ. 277.95 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ ఎం- క్యాప్ కూడా రూ. 7973.93 కోట్లు పెరిగి రూ. 96,853.59 కోట్లకు చేరింది.
>> ఇక రెండో రోజు కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల జోరు కొనసాగిందని చెప్పొచ్చు. అదానీ ఎనర్జీ 5.10 శాతం, NDTV షేరు 3.70 శాతం, అదానీ పవర 3.17 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 3.97 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 2.13 శాతం పెరగ్గా.. అదానీ గ్రీన్ ఎనర్జీ 1.99 శాతంs, అంబుజా సిమెంట్స్ 1.77 శాతం మేర పెరిగింది. అదానీ పోర్ట్స్ ఒక్కటి 0.18 శాతం పడిపోయింది.
సెన్సెక్స్ 30 షేర్లలో కిందటి రోజు 23 షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా అత్యధికంగా 4.07 శాతం పెరగ్గా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు 4.04 శాతం, ఎస్బీఐ 3.46 శాతం పుంజుకుంది. ఇన్ఫోసిస్ షేరు 2.95 శాతం, NTPC 2.65 శాతం పెరిగింది. టీసీఎస్ 2.24 శాతం, ఎల్ అండ్ టీ 2.24 శాతం, విప్రో 2.09 శాతం పెరగ్గా.. భారతీ ఎయిర్టెల్ 2.03 శాతం, టాటా స్టీల్ 1.65 శాతం మేర పెరిగింది. HUL, ఏషియన్ పెయింట్స్ వరుసగా 2.04 శాతం, 1.88 శాతం పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa