లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పి.. కనీస పరిజ్ఞానం లేకుండా పేరూరు డ్యాం గేట్లు విరగొట్టారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు నిర్మించే పరిటాల రవీంద్ర సాగునీటి కాలువతోపాటు పుట్టుకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను సందర్శించారు. అప్పట్లో రూ.805 కోట్లతో చేపట్టే పనులకు సీఎం చంద్రబాబు శిలాఫలకాలను ఆవిష్కరించారని అన్నారు. విరిగిన ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు అంచనాలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటితో పేరూరు ప్రాజెక్టు నిండితే ప్రకాశ రెడ్డి అత్యుత్సాహం చూపించారని, పరిజ్ఞానంలేకుండా 5, 8 గేట్లను విరగ్గొట్టారని విమర్శించారు. ఆరో గేటు చైనలింక్స్ దెబ్బతిన్నాయని, మొత్తం 8 గేట్లు సరిగా పనిచేయడంలేదని అన్నారు. టీడీపీ హయాంలో జైకా నిధులు రూ.22 కోట్లు మంజూరయ్యాయని, ఆ తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం చేతకాలేదని ఆమె విమర్శించారు. త్వరలోనే ప్రాజెక్టుకు నీరు అందించే పనులు ప్రారంభమౌతాయని తెలిపారు. కాగా, పేరూరు డ్యాం మోటార్లు, స్టార్టర్లు, వైరింగ్, లిగ్మెంట్స్ మరమతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ఆమె దృష్టికి తెచ్చారు. మరమ్మతులకోసం రూ.1.26 కోట్లతో అంచనాలు తయారు వేసి ప్రభుత్వ అనుమతుల కోసం పంపుతున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa