మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ఇటు రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చివరికి అధ్యక్ష బరిలో నిలిచారు. ఈ సందర్భంగా తాజాగా వీరిద్దరు నేతలు ఈ ఎన్నికల్లో తొలిసారి డిబేట్లో పాల్గొన్నారు. అయితే ఈ డిబేట్లో ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శించగా.. బైడెన్ మాత్రం ధీటుగా బదులు ఇవ్వలేకపోయారు. పైగా కొన్నిచోట్ల తడబడ్డారు. దీంతో సొంత పార్టీ నుంచే బైడెన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ను తప్పించాలనే వాదనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 81 ఏళ్ల బైడెన్కు వయసు సంబంధిత సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ప్రత్యర్థి 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ను ఢీకొట్టడంలో విఫలం అవుతున్నారనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్లీ ఒబామా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు ఈ ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ను మార్చి.. ఆ స్థానంలో మిషెల్లీ ఒబామాను రంగంలోకి దించే అవకాశం ఉందని టెడ్ క్రూజ్ తెలిపారు.
అయితే డెమొక్రటిక్ పార్టీ తరఫున మరికొందరు కూడా అధ్యక్ష రేసులో నిలుస్తున్నారు. మరో ఐదుగురు పేర్లు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. అందులో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మొదటివరుసలో ఉన్నారు. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హ్యారిస్ గత 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం కోసం పోటీపడి విఫలం అయ్యారు. వీరే కాకుండా కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చన్ విట్మెర్, ప్రస్తుత బైడెన్ క్యాబినెట్లోని మంత్రి పెటే బుట్టిజియాజ్, సెనేటర్ ఎలిజిబెత్ వారెన్ పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఏడాది నవంబర్ 5 వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 27 వ తేదీన జార్జియాలోని అట్లాంటాలో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో ఇద్దరు నేతలు చాలా ఆగ్రహంగా, ఆవేశపూరితంగా ప్రసంగించారు. అయితే ట్రంప్ దూకుడును ప్రదర్శించగా.. బైడెన్ వెనుకంజ వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa