ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పింఛన్లలను ఇంటింటికి తీసుకెళ్లి అందజేస్తున్నారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి రూ.4,408 కోట్లు నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ కుటుంబంలో ముగ్గురికి పింఛన్ అందజేశారు. అయితే ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ఓ అనుమానం మొదలైంది. ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.. దీంతో తెలుగు దేశం పార్టీ స్పందించింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'పేదలకు ఒకేసారి రూ.7 వేలు పెన్షన్ ఇస్తుంటే, జగన్ రెడ్డి ఓర్వలేక, తన ప్యాలెస్ బుద్ధి బయట పెట్టుకున్నాడు. చంద్రబాబు గారు స్పష్టంగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెప్తున్నా.. ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. తన హయాంలో (2024 ఏప్రిల్ ముందు) పేదలను పీక్కుతింటూ, ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తాం అంటూ వేసిన డప్పుని, నేడు మళ్ళీ చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
వాస్తవానికి గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారుడు మూడు నెలలు పించన్ తీసుకోకపోయినా.. అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పినా ఇలా దుష్ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ లబ్ధిదారులు ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని.. మూడు నెలలకు కలిపి ఒకసారి పింఛన్ తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు, ఆందోళన అసరం లేదంటున్నారు.
మరోవైపు పెనుమాకలో సీఎంద చంద్రబాబు పింఛన్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ తమ వల్ల కాదని, సాధ్యం కాదన్నారని.. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆరోజే తాను చెప్పానన్నారు. ఇవాళ 1.25లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పంపిణీ జరుగుతోందని గుర్తు చేశారు. వీరు అవసరమైతే మరికొందరి సహాయం కూడా తీసుకోవాలని చెప్పామని.. ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ చేసే పనిలో ఉన్నామన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టానని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదటిది మెగా డీఎస్సీ.. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. మూడోది అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై.. నాలుగోది యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య గణన.. ఐదోది పింఛన్ల పెంపుపై సంతకాలు చేశానన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అన్నారు. అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa