అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన అంబానీ కుటుంబం.. మరోసారి ముందస్తు పెళ్లి వేడుకలు చేపడుతోంది. ఈ వేడుకల్లో భాగంగా పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు మంగళవారం జూన్ 2వ తేదీన సామూహిక వివాహాలు జరిపించింది. ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ వేదికగా ఈ పెళ్లిళ్లు జరిగాయి. ఈ వివాహాలకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోక అంబానీ, ఈశా అంబానీ హాజరయ్యారు. కొత్త జంటల తరపున కొంత మంది బంధువులు ఈ పెళ్లిళ్లకు హాజరయ్యారు.
భారీగా కానుకలు..
సామూహిక వివాహాలు జరిపించడమే కాదు పుట్టింటి బాధ్యతలను తీసుకుని పెళ్లి కూతుర్లకు సారె పంపించింది అంబానీ కుటుంబం. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడకలు, మట్టెలు, పట్టీలు వంటివి అందించింది. అలాగే పెళ్లి కూతురికి స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్ అందించింది. వీటితో పాటు ఆ జంటలకు ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు సైతం అందించడం గమనార్హం. పుట్టింటి వారు తన కూతురికి పెళ్లి సారె అందించినట్లుగానే గ్యాస్ స్టవ్, మిక్సీ, పరుపులు, దిండ్లు, ఫ్యాన్, వంట సామగ్రి వంటివి అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ పెళ్లిళ్లకు హాజరైన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం. ఈ సందర్భంగా నూతన వధూవరులు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్గా మారాయి.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ఈనెల 12వ తేదీన జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వీరి పెళ్లికి వేదిక కానుంది. జులై 12 నుంచి మూడు రోజుల పాటు వేడుకలు ఉంటాయి. 12వ తేదీన శుభ్ వివాహ్తో మొదలై.. జులై 13న శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్తో ముగుస్తాయి. మరోవైపు.. ఇప్పటికే వీరి పెళ్లి దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. గుజరాత్లోని జామ్నగర్లో ఈ ఏడాది మార్చి తొలి వారంలో తొలిసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించింది అంబానీ కుటుంబం. దేశ విదేశాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. అలాగే లగ్జరీ క్రూయిజ్ షిప్లో రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa